కేసీఆర్కు దమ్ముంటే మంత్రులపై చర్య తీసుకోవాలి
మాస్ న్యూస్: మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డిల పాత్ర ఉందని అక్కడి రైతులు బహిరంగంగా చెబుతున్నారు. అవినీతిపరుల తాట తీస్తానని హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ఆ ఇద్దరు మంత్రులపై చర్య తీసుకోవాలి’’ అని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని తెలిపింది. గురువారం హైదరాబాద్లో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవినీతికి పాల్పడినందుకే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశానంటున్న ముఖ్యమంత్రి… మంత్రులు హరీశ్, పోచారంపైనా అదే చర్య తీసుకోవాలి. దళితుడైన రాజయ్యపై ఎంత వేగంగా చర్యలు తీసుకున్నారో ఈ మంత్రులపై కూడా అంతేవేగంగా చర్యలు తీసుకోవాలి. గనుల శాఖను చూస్తున్న హరీశ్ బంధువులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు కలిసి మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని అక్కడి రైతులు మాకు ఫిర్యాదు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్త అక్షర సత్యం. కొన్ని నెలలుగా వేల లారీల ఇసుక రవాణా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారో చెప్పాలి’’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని పోచారం గతంలో నిజామాబాద్ జిల్లాలో అనేకసార్లు ధర్నాలు చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడే తవ్వకాల వెనుక ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ‘‘ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి 29 మందితో ప్రభుత్వం కమిటీలు వేసింది. కానీ… 88 రీచ్లలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని నివేదికలు వచ్చినా ప్రభుత్వంగానీ, కమిటీలుగానీ ఏ చర్యలూ తీసుకోవడం లేదు. సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసి పత్రికల్లో ఫొటోలు వేయించుకొనే హరీశ్రావు తన శాఖ పరిధిలో ఇంత భారీ అక్రమాలు జరుగుతుంటే ఆకస్మిక తనిఖీలు ఎందుకు చేయరు?’’ అని రేవంత్ ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై తక్షణం విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న ఇసుక మాఫియా వెనుకున్న కేటీఆర్, హరీశ్రావులతో పాటు ఇతర మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు
Leave a reply
You must be logged in to post a comment.