బీహార్ రాజకీయాల్లో హైడ్రామా
మాస్ న్యూస్: ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ అధ్యక్షతన కేబినెట్ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్కుమార్ ఎన్నిక! బీహార్ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య జనతాదళ్ యునైటెడ్ శాసనసభాపక్ష నేతగా నితీశ్కుమార్ ఎన్నికయ్యారు. మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్డడానికి సన్నద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాంఝీపై బహిష్కరణ వేటు వేశారు. పార్టీ చీఫ్ శరద్ యాదవ్ ఆదేశాలమేరకు మొత్తం 111మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 97 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా ఏకగ్రీవంగా నితీశ్ను తమ నేతగా ఎన్నుకున్నారు. సీఎం మాంఝీ మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన అరుణ్ మాంఝీ నితీశ్ పేరును ప్రతిపాదించారని మంత్రి శ్రావణ్ కుమార్ మీడియాకు వివరించారు. కాగా ఈ సమావేశానికి ప్రస్తుత ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ తోపాటు మరో 13మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అంతకు ముందు.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి మాంఝీ మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తానని హెచ్చరించారు. జేడీ(యూ) శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం శరద్ యాదవ్కు లేదని చెబుతున్న మాంఝీ.. శనివారం కేబినెట్ను అత్యవసరంగా సమావేశపరిచారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఏడుగురు మంత్రులు మద్దతు పలకగా.. 21మంది మంత్రులు వ్యతిరేకించారు. ఈ సమాచారాన్ని నితీశ్ వర్గీయులు గవర్నర్కు, రాష్ట్రపతికి పంపించారు. మాంఝీకి బలం లేనందున ఆయన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని, నితీశ్కు 130 మంది ఎమ్మెల్యేల బలముందని పేర్కొన్నారు. కాగా, నితీశ్కు మద్దతుగా 20 మంది మంత్రులు రాజీనామా చేశారు.
శనివారం ఉదయంనుంచి పాట్నాలో హైడ్రామా నడిచింది. నితీశ్కు విధేయులైన ఇద్దరు మంత్రులను తొలగించాల్సిందిగా సీఎం మాంఝీ చేసిన సిఫారసులను గవర్నర్ ఆమోదించారు. మాంఝీ కూడా పోరాటానికి సిద్ధమవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇరువర్గాలమధ్య సయోధ్య కుదర్చడానికి చివరి ప్రయత్నాలు జరిగాయి. సీనియర్ మంత్రుల చొరవతో.. మాంఝీ.. నితీశ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇరువురి మధ్య జరిగిన చర్చల్లోనూ ఏ విధమైన పురోగతి లేకపోవడంతో.. ప్రతిష్టంభన అలాగే కొనసాగింది. నితీశ్ నివాసం నుంచి వచ్చిన వెంటనే మాంఝీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. నితీశ్కుమార్ మాట్లాడుతూ.. తనకు మెజారిటీ సభ్యుల బలం ఉందని, అవసరమైతే గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేలతో బలప్రదర్శనకూ సిద్ధమేనని ప్రకటించారు. తన ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పార్టీ అధ్యక్షుడు శరద్యాదవ్ గవర్నర్కు నివేదిస్తారని తెలిపారు.
Leave a reply
You must be logged in to post a comment.