హైదరాబాద్ మహానగరంలో అమెజాన్ రంగప్రవేశం
మాస్ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో అమెజాన్ రంగప్రవేశం చేయబోతోంది. హైదరాబాద్లో అతి పెద్ద గోదాముల నిర్మాణం చేపట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ గోదాముల నిర్మాణానికి భూమిని లీజు పద్దతిలో తీసుకోనున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయ నున్నట్లు ఆ కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అమెజాన్ కంపెనీకి రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆన్లైన్ వాణిజ్యంపై అమెజాన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆన్లైన్ వాణిజ్యం ద్వారా ఏ విధంగా ఆదాయాన్ని పొందవచ్చునో ఆ సంస్థలకు అవగాహన కల్పించ నుంది.. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటి ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ రాష్ట్రంలో
కూడా చేతివృత్తుల ఉత్పత్తులను కూడా అమెజాన్ వేదికగా ఆన్లైన్లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో నిర్మల్ చేతివృత్తులు, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల చీరలు, బిద్రీజరి వంటి ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు అమెజాన్ ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఆన్లైన్ వాణిజ్యంలో అమెజాన్ది అందెవేసిన చేయి. దక్షిణాది రాష్ట్రాల్లో బెంగూళూరు కేంద్రంగా పనిచేస్తున్నది. ఆన్లైన్ వాణిజ్య కార్యకలపాల వల్ల సంబంధిత రాష్ట్రానికే పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్లో నెలకొల్పడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి భారీస్థాయిలో పన్నులు రాబడి వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలోని చేతి వృత్తులు, ఉత్పత్తులను ప్రపంచానికి చాటేందుకు అమెజాన్ ముందుకు రావడం హర్షణీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అమెజాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ నెల రెండో వారంలో అధికారికంగా వెల్లడించే అవకాశమున్నట్లు తెలిసింది.
కేటీఆర్ను కలిసిన అమెజాన్ ప్రతినిధులు
పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును అమెజాన్ ప్రతినిధులు కలిశారు. బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్ చాంబర్లో అమెజాన్ గ్లోబల్ డైరెక్టర్ జాన్ స్కాయిల్టర్ బృందం కేటీఆర్తో భేటీ అయింది. తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తగిన సదుపాయాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో నిర్వహించేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వారు మంత్రికి తెలియజేసినట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్చంద్ర, ఐటీ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్సింగ్, తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్రంజన్, అమేజన్ కంపెనీ ఇండియా డైరెక్టర్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
Leave a reply
You must be logged in to post a comment.